లుంబినీ వనం
లుంబినీ వనం
లుంబినీ వనం( nepal) pc Wikipedia
600 BCE నాటికి నేపాల్ దక్షిణ ప్రాంతాలలో చిన్న గణ రాజ్యాలు, వంశాల సమాఖ్యలు ఏర్పడ్డాయి. అలాఏర్పడిన వాటిలో ఒకటి శాక్య రాజ్యం. 250 BC నాటికి ఈ దక్షిణ ప్రాంతాలు అశోక చక్రవర్తి ఏలుబడి లో ఉన్న మౌర్య సామ్రాజ్యం ప్రభావంలోకి వచ్చాయి . సాధారణ శకం 4వ శతాబ్దం నాటికి లిచ్ఛవి వంశస్థులు అధికారంలోకి వచ్చారు. అప్పటికి నేపాల్లో ఎక్కువ భాగం గుప్త సామ్రాజ్యం ప్రభావంలోకి వచ్చింది. నేపాల్ లోని ఖాట్మండు లోయలో ఉన్న వారిని కిరాతులు అన్నారు. పృథ్వీ నారాయణ్ షా అనే గూర్ఖా రాజు 1769 నాటికి లోయలోని అన్ని రాజ్యాలను (స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కీర్తిపూర్తో సహా) కలిపి ఏకీకృతం చేశాడు. 1923 నాటికి అది ప్రత్యేక దేశంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ హిందూ దేశం గా ప్రసిద్ధి పొందింది అయితే 2006లో మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశంగా మారింది.
నేపాల్లోని రూపండేహి జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన బౌద్ధ యాత్రా స్థలమే లుంబినీ వనం . రూపండేహికి మునుపటి పేరు రమ్మిండేయి. లుంబిని భగవాన్పురాకు ఉత్తరాన 3.2 కిమీ(2 మైళ్లు) దూరంలో ఉంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం సా.శ. ముందు 563లో రాణి మాయాదేవి సిద్ధార్థునికి జన్మనిచ్చిన ప్రదేశం.(BCE 563-483). సిద్ధార్థుడు శాక్యగణానికి చెందిన శుద్దోధనుడు మాయాదేవిలకు పౌర్ణమి రోజున లుంబిని వనంలో జన్మించాడు. మాయాదేవి తన కాన్పు కోసం పుట్టింటికి వెళ్తూ మార్గమధ్యంలో లుంబిని వనంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడే పురిటి నొప్పులు వచ్చి ప్రసవించింది. బుద్ధునికి పుట్టుకతో పెట్టిన పేరు సిద్ధార్థుడు. ప్రసవానంతరం మాయాదేవి మరణించింది. దాంతో మాయాదేవి చెల్లెలు గౌతమి, ఆమెకు పినతల్లిగా మారి సిద్ధార్థుని పెంచింది. అందువల్ల సిద్ధార్థుడు గౌతముడయ్యాడు.
సా.శ.పూర్వం 528లో తను 35 ఏళ్ల వయసులో గౌతముడు బీహార్ లోని గయ దగ్గర బుద్ధగయలో రావి చెట్టు కింద జ్ఞానోదయం పొంది బుద్ధుని గా మారాడు. బుద్ధుని జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన ప్రదేశాలలో లుంబినీ ఒకటి. తర్వాత బుద్ధగయ మరొకటి.
క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ఈ లుంబినీ వనాన్ని సందర్శించి నాలుగు స్థూప దిబ్బలు (స్మారక స్థూపాలు), గుర్రపు బొమ్మతో కూడిన రాతి స్థూపాన్ని నిర్మించి, దాని పైన 'దేవానాం ప్రియదర్శి ' (దేవతలకు ప్రీతిపాత్రుడైన [అశోకుడు])అని రాయించాడు. నేపాల్ చరిత్రను సరిగ్గా నమోదు చేయడానికి అశోకుడు ఏర్పాటు చేసిన శాసనాలు తోడ్పడతాయి . అశోకుడు ఖాట్మండు లోయను కూడా సందర్శించాడు. అక్కడ గౌతమ బుద్ధుని సందర్శనకు గుర్తుగా స్మారక కట్టడాలను నిర్మించాడు. పట్టాభిషేకం జరిగిన తరువాత 20 ఏళ్ల కు అశోకుడు ఈ సందర్శన చేశాడు.
బుద్ధ శాక్యముని ఇక్కడ జన్మించినందుకు గుర్తుగా ఒక రాతి స్తంభాన్ని నిర్మించాడు అశోకుడు. నేడది యునెస్కో రక్షణలో ఉంది.
లుంబినిలో మాయాదేవి ఆలయాన్ని కూడా నిర్మించారు. వివిధ దేశాల నుండి వచ్చిన బౌద్ధ సంస్థలచే నిధులు సమకూర్చబడిన అనేక కొత్త దేవాలయాలు పూర్తయ్యాయి. అనేక స్మారక చిహ్నాలు, మఠాలు, మ్యూజియం, లుంబినీ అంతర్జాతీయ పరిశోధన సంస్థ లుంబిని లో ఉన్నాయి. అలాగే పుష్కరిణి (పవిత్ర చెరువు) కూడా ఉంది. ఇక్కడ బుద్ధుని తల్లి అతని పుట్టుకకు ముందు స్నానం చేసింది. సిద్దార్థునికి తన మొదటి స్నానం చేయించింది.
లుంబిని సమీపంలోని ఇతర ప్రదేశాలలో చాలామంది బౌధ్ధులు జ్ఞానోదయం సాధించి, చివరకు నిర్వాణం చెందారు.
Pilla kumaraswamy ,9490122229
Comments
Post a Comment