కడప జిల్లాలోని పెద్ద ముడియంలో బౌద్ధ స్థూపం
క్రీస్తు శకం 1905–-1906 లో జమ్మలమడుగుకు దగ్గరలోని పెద్దముడియంలో పురావస్తుశాఖవారు తవ్విన తవ్వకాలలో క్రీస్తు శకం 1 లేదా -2వ శతాబ్దాలకు చెందిన బౌద్ధ స్థూపం బయల్పడినది. స్థూపం వద్ద మట్టి పాత్రలు, శాతవాహనుల సీసపు నాణేలు, మట్టి బొమ్మలు, పూసలు లభించగా చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలకు తరలించారు. ఇప్పటికీ పెద్దముడియం గ్రామంలో దక్షిణం వైపున అర్ధ కిలోమీటర్ పరిధిలో శిథిలమైన స్థూపాలు కుందూ నది సాక్షిగా సాక్షాత్కరమిస్తాయి. కడప కర్నూలు ప్రధాన రహదారిపై వున్న ఖాజీపేట మండలంలోని కొండపైన వెలసిన శ్రీ నాగనాదేశ్వర కోనకు కుడివైపున వున్న నేలమాళిగ క్రీస్తు శకం 2-, 3 శతాబ్దాల పురాతత్వ వారసత్వ గీతిక. ఈ ప్రాంతంలో శాతవాహనుల కాలంలో బుద్ధుడి త్రిశరణాలు, పంచశీల, భిక్షువుల పఠన ఘోషతో కొండలు, గుట్టలు ప్రతిధ్వనించాయి. బౌద్ధుల విహారాలు, బౌద్ధ ఉద్దేశిక స్థూపాలు, ఏకాంత ధ్యానానికి నెలవైన నేలమాళిగ నిర్మాణాల శిథిలాలు వున్నాయిఇక్కడ. నేలమాళిగ వద్ద శిథిలావస్థలో వున్న బుద్ధ భగవానుడి పాదాలు చాలా పెద్దవి. ఇంతవరకు బయల్పడిన పాదాలలో ఇవే చాలా పెద్దవిగా వున్న గౌతముడి పాదాలు. కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా ‘బౌద్ధ పర్యాటకం’లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చెయ్యాలి..
Comments
Post a Comment