మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలన్న బుద్ధుడు
మనిషి తన జీవిత కాలంలో ఉన్నతుడు కావాలంటే తన చరిత్రను, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి.ఇతరులపై ఆధారపడ కూడదంటాడు బుద్ధుడు, ఒక పువ్వు ఎలా తానే వికసించి, పరిమళిస్తుందో, అందరికిఅందాన్ని, సువాసనను వెదజల్లుతుందో అలాగా మనిషి కూడా తన్నుతాను మార్చుకుంటూ పదిమంది మార్పుకు దోహదం చేయగలగాలని బుద్ధుడు బోధించాడు.
బౌద్ధంలో విశిష్టమైన లక్షణం " ఎవ్వరో చెప్పినారని గ్రుడ్డిగా నమ్మకుండా తనంత తాముగా సత్యాన్నితెలుసుకోమని చెప్పడం" బుద్ధుడు 'నీకెవరో చెప్పినారని నమ్మకు, నీ గురువు చెప్పినాడని నీ గురువుపై ఉన్న
గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషనతో దానిని పది మందికి ఉపయోగపడతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారి చూపే మార్గంగా భావించు" అంటూ స్వీయ సాధనకు పెద్దపీట వేసాడు.
అలాగే పురాణాల్లో, మత గ్రంథాల్లోనూ రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దని కూడా చెప్పినాడు. పూర్వీకులు చెప్పినారని,గురువులు చెప్పినారని నమ్మవద్దు. స్వీయపరిశీనలతో, విశ్లేషణతో అవి సమ్మతమనిపిస్తే, వాటిని స్వీకరించవచ్చని,
ఆచరించవచ్చని చెప్పినాడు. కాని నేడు సమాజంలో సంప్రదాయవాదులే ఎక్కువ.వీరు మారరు.ఇతరులను మారనివ్వరు. సమాజం మారాలంటే బౌద్ధధర్మాలుపాటించేవారు పెరగాలి. అంటే బౌద్ధం విస్తారం కావాలన్నమాట.
మనిషి ధర్మపరివర్తన చెందటానికి కోపాన్ని నిగ్రహించుకోవటం ఒక పార్శ్వమైతే, అసూయను
పరిహరించుకోవటం రెండో పార్శ్వం. ఇతరులను చూసి అసూయ చెందువాడు ప్రశాంతంగా ఉండలేదు. అసూయ మనిషిని దహించివేస్తుంది. అసూయను మించిన నేరం ఏదీ లేదన్నాడు బుద్ధుడు.
సుఖదు:ఖాలనేవి మన మనస్సులో ఏర్పడే భావాలని బుద్ధుడు స్పష్టం చేశాడు. తూర్పు, పడమరల ద్వారా కష్టసుఖాలు నిర్ణయించబడతాయనుకోవడం పూర్తిగా తప్పన్నాడు. మనస్సులో ఏర్పడిన సుఖదు:ఖాలను నియంత్రించుకోవాలేగాని ఏవో బయటి శక్తులకు వాటిని ఆపాదించడం, వాటి నుండి రక్షింపబడాలనుకోవడంమూర్ఖత్వ మన్నాడు. ఇప్పటికీ సమాజంలో చాలా మంది తన గ్రహస్థితులవల్ల, ఏవో క్షుద్రశక్తులవల్ల తమ
పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ అంటుంటారు. ఇది సరియైనది కాదని బుద్ధుడు తేటతెల్లం చేశాడు.
Comments
Post a Comment